...

...

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పుస్తక సమీక్ష 31 - భారతదేశంలో స్త్రీ!

[పుస్తకం పేరు: భారతదేశంలో స్త్రీ (ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు) పేజీలు:112, వెల రూ.100/-, రచయిత: యస్.డి.వి.అజీజ్,  ప్రతులకు: 8106367175]

ఈ వ్యాసంలో అజీజ్ స్త్రీ గురించి ప్రాథమిక అవగాహన కలిగించడానికి (పాఠకులకు) వ్రాసినట్టు పేర్కొన్నాడు. అయితే భారత దేశపు స్త్రీ గురించి రచయిత తనకు తాను ఒక అవగాహన కలిగించు కోవడానికి వ్రాసినట్టుంది ఈ పుస్తకం. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలిసినా వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి విముఖత చూపుతాము. కారణం మనం వాటిపై కొన్ని నిశ్చితాభిప్రాయలతో ఉండి ఉంటాము. వాటిని మార్చుకోవడానికి సిద్ధపడము. పైకి మాత్రం సభ్యత సంస్కారం అనే నెపం వేస్తాము. ఈ సుదీర్ఘ వ్యాసంలో అజీజ్ ఆదిమానవుల కాలం నుండి నేటి వరకు స్త్రీల పరిణామ క్రమాన్ని సామాజిక కోణంలో  వివరిస్తూ వచ్చాడు.   సామాజిక అవసరాలను బట్టి పుట్టుకొచ్చిన ఆచారాలు సంప్రదాయాలుగా మారిన వైనం  వివరించాడు. బహుభర్తృత్వం, సతీసహగమనం, బహుభార్యత్వం,వితంతు పునర్వివాహ నిషేధం,  బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, దేవదాసి/ జోగిని/ బసివి వ్యవస్థ, కన్యాదానం, పరదా పద్ధతి, పాతివ్రత్యం, నోములు, వ్రతాలు మొదలైన ఆచారాల వెనుకనున్న కారణాలను చర్చించాడు. స్త్రీల పట్ల వివక్షత, స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ-కారణాలు, స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీల ఆత్మహత్యలు, భ్రూణహత్యలు, ఉద్యోగం చేసే స్త్రీల సమస్యలు, ఇబ్బందులు, వ్యభిచారం, స్త్రీల పట్ల వ్యాపార దృక్పథం, భోగవస్తువుగా స్త్రీలను చూడటం ఇలా అన్ని విషయాలకు మూలాలను వెదికాడు.  స్త్రీల సామాజిక హోదాలో వచ్చిన మార్పులను ఎత్తి చూపాడు.  లైంగిక స్వేచ్ఛ, కుటుంబ విచ్ఛిత్తి, పెళ్లి లేకుండా సహజీవనం గడపడం, స్త్రీవాదం మొదలైన విషయాలను కూడా ప్రస్తావించాడు. వివిధ రంగాలలో, వృత్తులలో, కళలలో భారత స్త్రీలు సాధించిన ప్రగతిని సోదాహరణగా పేర్కొన్నాడు. వ్యాసాన్ని ముగిస్తూ ఇలా పేర్కొంటాడు. "పురుషుడు ఎంతగా ఎదిగినా స్త్రీ పాదాలముందు దోగాడే పసిపిల్లవాడే! ఆమె సహకారం లేనిదే పురోగతి సాధించలేడు." ఈ వ్యాసం వ్రాయడానికి ఉపయోగ పడిన పుస్తకాల జాబితా పరిశీలిస్తే అవి ఎక్కువభాగం హేతువాదుల, నాస్తికుల రచనలుగా గోచరిస్తాయి. వారి ప్రభావం ఈ పుస్తకంపై స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. రచయిత కొన్ని చోట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలు కొందరిని హర్ట్ చేసేవిగా ఉన్నాయి, ముఖ్యంగా శంకరాచార్యుల పై చేసిన ఆరోపణ.ఓ మతాన్ని కాని, కులాన్ని కానీ, వర్గాన్ని కానీ కించపరచే ప్రయత్నం చేయలేదు అని డిస్క్లయిమర్ ఇచ్చాడు కానీ ఈ పుస్తకం నిండా బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఆ పాపం రచయితది కాదు అతడు రెఫెర్ చేసిన పుస్తకాలవి.   

కామెంట్‌లు లేవు: