...

...

28, ఏప్రిల్ 2012, శనివారం

వానప్రస్థం కథపై జ్యోతిర్మయిగారి విశ్లేషణ!


       ఆలోచనా ధోరణిలోని వ్యత్యాసం గురించీ, ఆదర్శవంతమైన జీవన విధాన౦ గురించీ చెప్పే ఈ కథ, చక్కని కథనంతో ఆద్యంత౦ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ కథలో అనురాగం, ఆత్మీయత మనకు అడుగడుగునా కనిపిస్తాయి. కథకు తగిన శీర్షిక 'వాన ప్రస్థం'.

      స్వదేశం వెళ్ళిన రాంబాబు, పొలం అమ్మే నిమిత్తం తమ ఊరికి వెళుతూ తన స్నేహితుని తల్లిదండ్రులైన మూర్తి, వర్ధనమ్మగార్లను కలుస్తాడు. ఆ దంపతులు వారి అభిమానంతో అతన్ని ఓ రోజు అక్కడే ఉండేలా ఒప్పిస్తారు. ఆ వయసులో వారి వ్యాపకాలు, తద్వారా చేసే సమాజ సేవ చూసి ముచ్చట పడతాడు రాంబాబు. సుఖమయ జీవనం కోసం ఆహారం విషయంలోనూ వారు తీసుకు౦టున్న శ్రద్ధ, వ్యాయామం, వారు ఆచరించే జీవన విధానం చూసి "నిజం చెప్పద్దూ - మీరిద్దరూ డెబ్బై దాటిన వాళ్ళల్లా కనిపించరు. ఏదో నిన్ననే అరవయ్యో పడిలో వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు."  అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. 

       ఆ సమయంలోనే రాంబాబు, తన అక్క అనారోగ్యం విషయంగా, ఆవిడకు శారీరక రుగ్మత కంటే, మానసిక రుగ్మతే ఎక్కువగా ఉన్నట్లు చెప్తాడు. వారి సంభాషణల్లో ఆ దంపతుల మధ్య అవగాహన, కలసి పనిచేసుకోవడంలోని ఆనందం గురించి తెలుసుకుంటాడు. రాంబాబు అక్క, తన పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ, ఆ దంపతులు తమ పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ ఉన్న తేడాలను రచయిత స్పష్టంగా వ్యక్తీకరించారు.

       రచయిత, మూర్తి గారి ద్వారా చెప్పించిన ఈ మాటలు, ఈ కథకు ప్రాణమని చెప్పొచ్చు. 

'ఎక్స్పెక్టేషన్' అనేది అది కేన్సర్ లాంటిది. నిన్నూ నీ చుట్టూ ఉన్న వాళ్ళనీ కనిపించకుండా దహించేస్తుంది..."  అని చేప్తూ తమ ఆరోగ్య రహస్యం కూడా చెప్తారు. "మేం సంతోషంగా ఉంటాం. ఒకర్నొకరు తిట్టుకోం. తప్పులెన్నం. వీలయినంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల్నుండి మేం ఏమీ ఆశించం. ఇదే మా ఆనందానికి కారణం. మేం ఎవరినుండీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయం." 


     కథ ముగింపులో రాంబాబు తన అక్క గురించి అనుకున్న మాట ఈ కథకు పరిపూర్ణతనిచ్చింది. ఈ కథలో మంచి సందేశం ఉంది. చిరకాలం గుర్తుండి పోయే కథ 'వాన ప్రస్థం'. 

     కథాజగత్ లో ప్రచురితమైన 'వానప్రస్థం' కథను మీరు ఇక్కడ చదవొచ్చు.  


(శర్కరి బ్లాగు సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: