...

...

19, మార్చి 2012, సోమవారం

బుజ్జిగాడిబెంగ కథపై మాలాకుమార్ అభిప్రాయం!

      బాల్యం . . . ఎంత అపురూపమైనది. చిన్నప్పటి ఆటలు, పాటలు, చిలిపి అల్లరులు జీవితాంతం మరువలేనివి .అమ్మతో కథలు కథ గా చెప్పించుకొని మురిసిపోని వారెవరు? బాల్య స్నేహితులంటే ఎంత మురిపెం . . . తూనీగల్లా గెంతుతూ ముచ్చటపడేసేది బాల్యం. ఆటల్లో మోచేయి కొట్టుకొని, మోకాలు డోక్కుపోయి రక్తాలు కారుతున్నా ఆటల్లో దెబ్బ అరిటిపండే! పైగా పెద్దయ్యాక తమ పిల్లలకు ఆ దెబ్బలగురించి కబుర్లు చెప్పటం ఎంత బాగుంటుంది కదూ! స్కూల్ నుంచి వస్తూనే స్కూల్ బాగ్ లోపలికి గిరాటేసి, అమ్మ ఇచ్చిన పాలు హడావిడిగా తాగేసి, మూతైనా తుడుచుకోకుండా ఆటలకు పరుగులు పెట్టటం, అలసిపోయి వచ్చి, ఏదో స్నానం చేసాము, చదువుకున్నాము అనిపించుకొని, నిద్రతో కూరుకు పోతున్న కళ్ళను బలవంతాన తెరుచుకుంటూ, అమ్మ చెప్పే కథలను వింటూ, అమ్మ చేతి ముద్దలు తింటూ , అలానే పీట మీద నిద్ర కొరగటం, అమ్మ ఎత్తుకెళ్ళి 'పిచ్చితల్లి అలిసిపోయింది' అని మురిపెం గా అంటూ పడుకోపెట్టటం . . . అబ్బ అవన్నీ తలుచుకుంటూవుంటే మళ్ళీ చిన్నారి తల్లి ఐపోవాలనిపించదూ !!!!! మరి ఈ కాలం పిల్లలకు ఆ మురిపాలు దక్కుతున్నాయా ????? చదువులు, రాంకులూ అంటూ పోటీ చక్రం లో వాళ్ళ బాల్యం బంధీ ఐపోయింది .ఆటలూ లేవు . అల్లరులూ లేవు. పొద్దున్నే స్కూల్, ఇంటికి రాగానే ట్యూషన్, హోంవర్క్ ఇంతే జీవితం. మహా ఐతే వీడియో గేమ్స్ఆడుకోవటం అంతే కదా...

            అలా బంధీ ఐపోయిన ఓ చిన్నారి స్వగతమే, ఎనుగంటి వేణుగోపాల్ గారు రచించిన కథ " బుజ్జిగాడి బెంగ " 


       బుజ్జిగాడి కి వానపడె ముందు వచ్చే మట్టి వాసన అంటే చాలా ఇష్టం. వానలో తడవట మంటే మరీ ఇష్టం. ఆకాశం లొంచి రాలిపడే ఆ నీటి బుగ్గలను అలా చూడటమంటే భలే సరదా .ఎగిరి గంతేయాలనిపిస్తుంది .వర్షా కాలం వచ్చిందంటే చాలు "రెయిన్ రెయిన్ , కం ఎగేయిన్ " అనే రైం అస్తమానమూ పాడుకుంటూ వుంటాడు. వర్షం వచ్చినప్పుడు తడవాలనుకుంటాడు . కాని వీలవదు. ఎందుకంటే వాడి చెల్లాయి డైనొసార్ లా వదల కుండా వెంబడించి , డాడీకి చెప్పేస్తుంది :( పాపం బుజ్జిగాడు !

       వాళ్ళ డాబా కెదురుగా గుడిసెలో వున్న శీను గాడిలా మట్టిలో ఆడుకోవాలని , రెండు జేబుల్లోనూ మట్టివేసుకొని గెంతాలని వుంటుంది . కాని వీలవదు . మార్నింగ్ లేస్తాడా... లేవగానే ట్యూషన్ .ట్యూషన్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అవుతాడా, స్కూల్ బస్ సిద్దం . సాయంత్రం హోంవర్క్ .తర్వాత మళ్ళీ ట్యూషన్. ట్యూషన్ అయ్యాక కాసేపు స్టడీ.ఇవన్నీ అయ్యేసరికి రాత్రి తొమ్మిదవుతుంది. అన్నం తినిపించి పడుకోపెడతారు. మార్నింగ్, ఈవినింగ్ రెండుసార్లు ట్యూషన్ ఎందుకంటే సెకండ్ యూనిట్ లో సెకండ్ రాంక్ వచ్చిందని! హుం. . . ఆ చిన్నివాడికి ఎంత కష్టం అని గుండె పట్టుకు పోవట్లేదు?

       చివరికి వాడి డాడీ వాడిని వానలో ఆడుకోనిస్తాడు. కాని ఎప్పుడు, వాడికి మళ్ళీ ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడు.

       ఇలా వున్న బుజ్జిగాడి స్వగతం చదువుతుంటే మనకూ బెంగ వచ్చేస్తుంది. ప్రతి వాక్యం లోనూ వాడి బాధ మన కళ్ళలో నీళ్ళు, ఇదేమిటి ఈ కాలం పిల్లలు ఇలా మెకానిక్ గా ఐపోయారు అనిపిస్తుంది. అసలు నాకైతే చదువుతున్నట్లుగా లేదు , ఓ బుజ్జిగాడు నా ముందు కూర్చొని చెపుతున్నట్లుగా అనిపించింది . అంతలా హృదయాలను తాకేట్లుగా రాసారు రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు. చాలా సరళ మైన భాష లో, ఓ చిన్నపిల్లవాడు చెపుతున్నట్లుగానే రాసారు. అన్ని సంఘటనలు, మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరుగుతున్నట్లుగా వున్నాయి. చిన్నపిల్లలున్న ప్రతి తల్లీ తండ్రి తప్పక చదవ వలిసిన కథ ఇది.

      ఏదైనా ఒక నీతి చెప్పాలంటే అది కథలో భాగమవ్వాలి కాని, ఆ కథ ఓ డాక్యుమెంటరీ సినిమాలా ఓ నీతి సూత్రం చెపుతున్నట్లుగా వుండకూడదు, అని నా అభిప్రాయం . ఈ కథలో బుజ్జిగాడి బాధ లో మనం లీనమవుతామే కాని, ఏదో సందేశాత్మక కథ చదువుతున్నట్లుగా వుండదు . పూర్తిగా చదివిన తరువాత పిల్లలను చదువు కోసం ఇలా బాధ పెట్టకూడదు అనిపిస్తుంది. అది నాకు చాలా నచ్చింది.

ఇంత మంచి కథ ను మిస్ కావద్దు . " బుజ్జిగాడి బెంగ " ను " కథా జగత్ " లో చదవచ్చు .




1 కామెంట్‌:

మాలా కుమార్ చెప్పారు...

నా ఆర్టికల్ ను ప్రచురించినందుకు థాంక్స్ అండి .

మీ రిచ్చిన బుక్ ను డౌన్లోడ్ చేసుకోవటం నాకు రాలేదండి .