...

...

5, జులై 2009, ఆదివారం

ఇప్పుడు ఇరానీ చాయ్ మరింత ప్రియం!!!

అవును. ఇరానీ చాయ్ రేటు పెంచేశారు.

ఒకటో తారీకు నుండి ఇరానీ చాయ్ కప్పు ఆర్రూపాయలు!

ఈ ఇరానీ చాయ్‌కి జంట నగర వాసులతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.

హైదరాబాద్ సంస్కృతిలో ఇరానీ చాయ్ ఒక భాగంగా మారిపోయింది.

బ్లాక్ టీ, లెమన్ టీ, చాక్లెట్ టీ ఇలా టీలలో ఎన్ని రకాలున్నా అవి ఇరానీ చాయ్ రుచి ముందు దిగదుడుపే.

నలుగురు దోస్తులు కలిశారంటే ఇరానీ హోటల్లో తీన్ మే చార్ చాయ్ తాగాల్సిందే. గంటలకు గంటలు బాతాఖానీ కొట్టాల్సిందే.

అన్ని ఋతువులలోనూ అన్ని సమయాల్లోను ఇరానీ హోటళ్లు కళకళ లాడుతూ ఉంటుంది.

ఈ చాయ్‌ని తాగడంలో బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడి ప్రజలు. కొందరు సాసర్లలో ఒంచుకుని నోటితో జుర్రుకుంటూ తాగితే ఇంకొందరు ఉస్మానియా బిస్కట్ చాయ్‌లో ముంచి తింటూ కొద్ది కొద్దిగా చాయ్‌ని సిప్ చేస్తూ తాగుతారు.

ఈ ఇరానీ చాయ్ మహత్యాన్ని పొగుడుతూ తెలుగులో కవితలు, పద్యాలు, దండకాలు గట్రా వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ ఈ చాయ్ సేవించి మహత్తరమైన తెలుగు ఉర్దూ కవిత్వాలు వెలువడినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను.

ముఖ్యమైన సాహిత్య చర్చలు ఈ ఇరానీ హోటళ్లలోనే జరిగేవట!

హైదరాబాదీయులు ఉట్టి భోళా మనుషులు.

ఒక కప్పు చాయ్ త్రాగిస్తే చాలు ఎవరైనా సరే ఇట్టే మిత్రులుగా మారిపోతారు.

మనం ఎంత గొప్ప విజయం సాధించినా ఇక్కడి ప్రజలకు పెద్ద పెద్ద విందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరానీ హోటళ్లలో చాయ్ పార్టీ ఇచ్చినా చాలు మహదానంద పడిపోతారు.

ఈ చాయ్ విషయంలో ఇక్కడివారికి ఒక నియమం ఉంది. చాయ్‌ను ఎవరు తాగడానికి ఆఫర్ చేస్తారో వారే ఆ చాయ్ బిల్లు కట్టాలి. తెలియక పొరబాటున వేరొకరు బిల్లు కడితే తాగడానికి రమ్మన్న ఎదుటి వ్యక్తి అవమానంగా ఫీల్ అవుతాడు. ఒక్కోసారి అది వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బెడిసి కొట్టొచ్చు.


మన పురాణ కాలంలోనే ఈ ఇరానీ చాయ్ ఉండి ఉంటే మనం చదివే పురాణ కథలు మరోలా ఉండేవి.

రాక్షసులకు ఈ ఇరానీ చాయ్ రుచి తెలిసుంటే అమృతం కోసం తాపత్రయ పడేవారు కాదు. తమ దాయాదులకు దాన్ని వదిలి పెట్టేవారు.

పరమ శివుడు గరళాన్ని కాబట్టి అలా గొంతులో మ్రింగ కుండా ఉంచుకోగలిగాడు కానీ అదే గరం గరం ఇరానీ చాయ్ అయితే మ్రింగ కుండా ఉండగలగడం అతని తరం అయ్యేది కాదు.

అసలు సంజయుడు, శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు వారికి ఇరానీ చాయ్ ఇచ్చి గౌరవించి ఉంటే మహాభారత సంగ్రామం జరిగి ఉండేదా?

ఇంత ప్రాధాన్యత కలిగిన ఇరానీ చాయ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 40 పైసలకు దొరికేది.

తరువాత్తరువాత దీని ధర 50 పైసలు, 60 పైసలు, 75 పైసలు, ఒక రూపాయి, రూపాయి పావలా, రూపాయిన్నర, రూపాయి ముప్పావలా, రెండ్రూపాయలు, రెండున్నర, మూడురూపాయలు, నాలుగు రూపాయలు ఇలా పెరుగుతూ వచ్చింది.

మొన్నమొన్నటి వరకు ఈ ఇరానీ చాయ్ ఐదు రూపాయలకు దొరికేది.

ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు.

మా ఆవిడ కిలో కంది పప్పు 72రూపాయలైందని గోల పెడుతోంటే నేను అంతగా పట్టించుకోలేదు.

కానీ చాయ్ ధర పెరిగిందంటే మాత్రం మనసులో విలవిల లాడుతున్నాను.

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీ ఇచ్చి వాటి ధరలను అదుపు చేసినట్లు ఇక్కడి బల్దియా ఇరానీ చాయ్ పై సబ్సిడీ ప్రకటించాలి.

కామెంట్‌లు లేవు: